పింఛను భరోసా ఏదీ?

ఇన్నాళ్లు పెన్షన్ కోసం తీరుగుతున్న మీకు మీ ఇంటి గడప వద్దకే ఫింఛను వచ్చే ఏర్పాటు చేస్తానంటూ ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల ప్రచారంలోనూ అంతకు ముందు తన పాదయాత్రలోనూ తెగ ఊదరగొట్టారు.అధికారంలోకి రాగానే పింఛను మూడు వేలు పెంచుతానంటూ జగన్ మాటలు నమ్మిన వారంతా క్యూలైన్లలో నిలబడి మరీ ఓట్లేసి ఏకంగా 151 మంది శాసనసభ్యులని అందించారు. తిరుగులేని మెజార్టీలో అధికారంలోకి వచ్చిన జగన్ తన సంతకాన్ని పింఛన్ పెంపుపై చేసారు. తీరా అది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలకు మాత్రమే కావటం… దశలవారీగా పెంచుతానంటూ సన్నాయి నొక్కులు నొక్కటం ఆవేదన కలిగించేదే అయినా, వచ్చిన కాడికి చాలంటూ వచ్చిందే అని మౌనంగా ఆ పింఛన్ అందుకోవటం ఆరంభించారు.
అప్పటివరకు క్యూలైన్లలో పింఛను అందుకునే పరిస్థితి దాటి పెన్షన్లతో సహా ప్రజలకు అందే పథకాలన్నీ వారి ద్వారానే ఇంటింటికీ చేరుస్తామనితీసుకువచ్చిన గ్రామవాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పనిచేయటం ఆరంభించింది. అంతవరకు బాగానే ఉంది. ఆర్ధిక వ్యవస్థ కుదేలై ఖజానా కాస్త ఖాళీ అయిన తరుణంలో పింఛన్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇక అర్హులకే అంటూ ఈ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఇందుకు అనుగుణంగానే గ్రామ వాలంటీర్లు, సచివాలయాలతో సర్వే ఆరంభించింది.
దీంతో తమ పార్టీకి అనుకూలంగా లేని వారి ఫింఛనుని ఆగిపోయింది. ఇదేమని ప్రశ్నిస్తే, మీకు పింఛను కావాలంటూ ఫలానా వైసిపి నాయకులను కలవండి , వైసిపి పెద్దల అనుగ్రహం పొందండి. ఇళ్ల స్థలం, రేషన్ కార్డు, ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకం ఏది దక్కాలన్నా అధికార పార్టీ నాయకులు ఆశీస్సులు ఉండాల్సిందే.స అంటూ గ్రామ, వార్డు, సచివాలయ వాలంటీర్లు. చెపుతుండటంతో అవాక్కవ్వాల్సిన పరిస్థితి.
పాలనలో , పథకాల అమలులో పారదర్శకత కోసమే వాలంటీర్లు వ్యవస్థ తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఆ పార్టీ నాయకులు మాత్రం వాలంటీర్లను వైసిపి కార్యకర్తలుగానే వినియోగిస్తున్నారన్నది వాస్తవంగా కనిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమపథకాల నిరీక్షిస్తున్న వారిని సర్వే చేసి, వేర్వేరు కాపురాలున్నా, ఇంట్లోవాళ్లలో ప్రభుత్వ ఉద్యోగం ఉందనో, సంక్షేమ పథకం ద్వారా ఇప్పటికే ఉపాధి పొందుతున్నాడనో నెపంతో వికలాంగులు, వృద్ధుల పింఛనుదారులు వేలాది మందిని తొలగించడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. మరోమారు అర్జీనివ్వండి ఓ సలహా సూచిస్తున్న వాలంటీర్లు పనిలో పనిగా ఇది శాంక్షన్ కావాలంటే ఫలానా నేతలను కలవాలని సూచిస్తున్నారు దీంతో పింఛను కోసం నేతల వెంట క్యూకడుతున్నారు. ఇదే సమయం అంటూ నేతల సన్నిహితులు వారి నుంచి వసూళ్ల దందాలూ ఆరంభించినట్టు ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
వాస్తవానికి గతంలో దివంగత నేత వైఎస్సార్ అప్పటి వరకు ఉన్న 75 రూ. పింఛను ఎటూ చాలదంటూ రూ.200 పెంచారు. ఆతని మరణం తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు దానిని కొనసాగించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్ధికంగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులలో ఉన్నా ఫింఛన్లను చంద్రబాబు నాయుడు వెయ్యికి పెంచారు. ఆపై దానిని మళ్లీ 2వేలకు చేసారు. జగన్ దానిని 2250 చేసారు. అయితే తాజాగా జరిగిన వాలంటీర్ల సర్వేలో సవాలక్ష వంకలు పెట్టి కుల, మత, పార్టీల వారీగా పింఛనుదార్లని విడదీసి, అందులో చివరకి కరెంటు మీటర్ ఉన్నా సరే పింఛను రద్దుకు సిఫారసులు చేసారు. దీంతో దాదాపు 7 లక్షల మంది వరకు పింఛనుదార్ల పేరు జాబితాలో కనిపించకుండా పోయాయి
ఎన్నో సంవత్సరాల నుండి ఫింఛన్లు తీసుకుంటున్నాం. ఒక్కసారిగా మా ఫింఛన్లు రద్దు చేసి మా పొట్టలు కొట్టారని ఫింఛను రాని వారు ఆవేదనతో రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఆందోళన అవసరం లేదు సర్వే చేసిన వలంటీర్లు ఇచ్చిన నివేదికలు మరోమారు పరిశీలించి రెండు నెలల పింఛను ఒకే సారి ఇప్పిస్తానంటూ ముఖ్యమంత్రి ప్రకటించింనా ఎక్కడా ఆందోళన ఆగటంలేదు. ఎన్నో ఏళ్లకిందట కరెంటు మీటరును అమర్చుకున్నాం. పేరుకే ఆ మీటరు మా పేర ఉంటుంది. మీటరు ఉన్న ఇంటిలో మా వారసులు ఉంటున్నారు. మాకు వారికి ఎలాంటి సబందాలు లేవు. మేము వేరేగా ఉంటూ ఫింఛన్లు తీసుకుంటున్నాం., మా బతుకు మాదిగా మారిపోయిందని కానీ మీ వారసులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని, అందుకే ఫించన్లు రద్దు చేశాం అనంటూ వాలంటీర్లు ఇస్తున్న సమాధానాలు బెంబేలెత్తించేలా ఉన్నాయి.
తమకు ఎలాంటి ఆధారం లేదని, ప్రభుత్వం ఇచ్చే ఫింఛను తొలగించటం ఏమిటి.. అని వృద్దులు లబో దిబో అనంటూ మొత్తుకుంటుంటే , మంత్రులు మాత్రం కొన్ని లక్షల ఫిర్యాదులు ప్రభుత్వానికి అందటం వల్లే, సర్వే చేసి. ఫింఛన్లు తొలగించామని, ఇందులో తప్పేముందని అడ్డగోలు వాదన ఆరంభించడంతో అవాక్కవ్వటం పండుటాకుల వంతవుతోంది. అయితే వారిలో అర్హులైన వారందరికీ ఫింఛన్లు వారం రోజులలో ఇస్తున్నామని మంత్రులు చెబుతున్నారు
అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ఒత్తిళ్లు.. వలంటీర్ల అత్యుత్సాహంతో… అర్హులైన ఫింఛను దారులపై కూడా అనర్హత చూపించి లక్షలాది ఫింఛన్లు తొలగించారని విమర్శలు వస్తున్నాయి. ఆవిధంగా తొలగించిన వారిలో ఎంతమందికి ఫింఛన్లు ఇస్తారో.. వేచి చూడాల్సిందే. అన్యాయంగా ఫింఛన్లు తొలగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు తొలగించిన లక్షలాది ఫింఛన్లలో మళ్లీ ఎంత మందికి ఫింఛన్లు ఇస్తారు అనే విషయం బయట పడటం లేదు.