తెలంగాణ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పోస్టు రద్దు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పోస్టు రద్దు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పోస్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల సదస్సుకు రెండు రోజుల ముందు.. జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేసి, ఆ స్థానంలో అదనపు కలెక్టర్ పోస్టును సృష్టించింది.
ఐఏఎస్లతో పాటు నాన్కేడర్ అధికారులను అదనపు కలెక్టర్ పోస్టుల్లో నియమిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి జిల్లాల్లో జేసీలు ఉండరు. ఆ స్థానంలో అదనపు కలెక్టర్లు పనిచేయబోతున్నారు. స్థానిక సంస్థలకు ఒకరు, రెవెన్యూ పాలనకు మరొకరు పనిచేయనున్నారు. గత రాత్రి భారీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసి, వారికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.
నాన్ కేడర్ అధికారులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను అదనపు కలెక్టర్లుగా నియమించగా.. ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్లుగా పోస్టింగులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల సదస్సు జరగడానికి 2 రోజుల ముందు హఠాత్తుగా 49మంది అధికారులను బదిలీ చేయడంతో పాటు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇటీవలే 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం.. తాజాగా అదనపు కలెక్టర్లను నియమించింది.