సినీ క్రిటిక్స్ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావుకు నివాళి

తెలుగు సినిమా జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న క్రిటిక్స్ పసుపులేటి రామారావు మంగళవారం ఉదయం అర్ధంతరంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. పాత్రికేయ వృత్తిలో అందునా సినీ జర్నలిజంలో తనదైన ప్రత్యేక బాణీ ఏర్పాటు చేసుకుని నేటితరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలచిన వ్యక్తి. సీనియర్ ఎన్టీఆర్ , ఎన్నార్ల కాలం నుంచి నేటి తరం హీరోల వరకు అందరితో సాన్నిహిత్యం ప్రదర్శించి అందరి మన్నలను పొందారు. సినిమా ఇండస్ట్రీలో ఎందరో నటీనటులతో కలసి ప్రయాణించిన అనుభవం ఆయనది. తన పాత్రికేయ జీవితాన్నివిశాలాంధ్ర పత్రికతో ప్రారంభించిన రామరావు గారి స్వస్థలం ఏలూరు. డిగ్రీ దాకా విద్యాభ్యాసం చేశారు. ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీలలో కీలక సభ్యునిగా చాలా కాలం పని చేశారు.కు
పసుపులేటి అని పేరు చెప్పగానే అగ్రహీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలు సైతం సెట్ లో ప్రత్యేకంగా కొంత టైం కేటాయించి మరీ ఇంటర్వూలు ఇచ్చేవారంటే ఆయన అందరితో ఎంత అన్యోన్యంగా ఉండే వారో అర్థం చేసుకోవచ్చు. సినిమా పరిశ్రమలో చెన్నైలో ఉన్నప్పుడు తన విస్తృతమైన పరిచయాల ద్వారా ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నెనో విశేషాలు అందరికంటే ముందే ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా రాసి అందించే వారు. వయసుని లెక్క చేయకుండా నిన్నమొన్నటి వరకు సినీ ఇంటర్వూలలో ఉత్సాహంగా పాల్గొంటూ అందరినీ పేరు పేరునా మనస్ఫూర్తిగా పలుకరించేవారు.
ముదిమి వయసులోనూ రామారావు సినీ నేపథ్యంలో అనేక రచనలు చేసారు. చిరంజీవి. శ్రీదేవి, సావిత్రి, దాసరి లాంటి దిగ్గజాల గురించి పసుపులేటి రాసిన పుస్తకాలు సినిమా ప్రేమికులకు మంచి రిఫరెన్స్ గా నిలిచాయి. చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకుని మరీ బుక్ లాంచింగ్ కు విచ్చేయడం విశేషం.అప్ కమింగ్ జర్నలిస్టులకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా ముందుకువచ్చే పసుపులేటి రామారావు గారు ఇక లేరన్న వార్త మీడియా లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్న ఆయన ఇంటికి పెద్ద ఎత్తున పాత్రికేయులు, సినీ పరిశ్రమకు చెందిన వారు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. చాలా అరుదైన వ్యక్తిత్వం ఆయనదని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రామారావు గారు భౌతికంగా లేకపోయినా పరిశ్రమకు చేసిన సేవలు మాత్రం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. సినీ పాత్రికేయానికి సరికొత్త ఒరవడి తీసుకువచ్చిన పసుపులేటి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజున్యూస్ నివాళులర్పిస్తోంది.