సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా?

మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ సుజనాచౌదరి సూచించారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోరని చెప్పారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుగుణంగా అధికారులు పనిచేయడం సరికాదన్నారు. ఎయిమ్స్, నిఫ్ట్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయని తెలిపారు. హైకోర్టు, సచివాలయం, రాజ్భవన్ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్-6లో స్పష్టంగా ఉందన్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం పరిపాలనపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మారిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని సుజనాచౌదరి తెలిపారు.