సంక్రాంతి.. బ్రేక్ ఈవెన్ ఎవరికి?

ఈ సంక్రాంతి బరిలో పోటీపడిన చిత్రాల్లో బ్రేక్ ఈవెన్ దక్కేది ఎవరికి? బాలయ్య నటించిన `ఎన్టీఆర్ కథానాయకుడు` 9న విడుదల కాగా, ఆ తరువాత వచ్చింది రామ్చరణ్ `వినయ విధేయ రామ`. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా పోటీకి దిగిన సినిమా `ఎఫ్2`. ఈ మూడు చిత్రాల్లో ముందు విడుదలైన `ఎన్టీఆర్ కథానాయకుడు`, రామ్చరణ్ `వినయ విధేయ రామ` డివైడ్ టాక్ను సొంతం చేసుకోగా ఈ సంక్రాంతికి జెన్యూన్ హిట్గా నిలిచిన సినిమా `ఎఫ్2`. అయితే ఈ మూడు చిత్రాలు బ్రేక్ ఈవెన్ సాధించడం కోసం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి.
బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన చిత్రం `ఎన్టీఆర్- కథానాయకుడు`. సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో చర్చ జరిగినా ఈ సినిమా వసూళ్లు మాత్రం ఆశాజనకంగా లేకపోవడం చిత్ర వర్గాలను కలవరానికి గురిచేస్తోంది. 53.44 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా పెట్టుబడిని సాధించినట్టే. అయితే ఇది సాధించడమే ఈ చిత్రానికి గగనంగా మారుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 8 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా 18.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సినిమాని మాత్రం 72.23 కోట్లకు బయ్యర్లకు అమ్మేశారు. ఆ మొత్తం దేవుడెరుగు సినిమా కోసం ఖర్చు చేసిన పెట్టుబడి కూడా తిరిగొచ్చే అవకాశం కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు. ఇక `వినయ విధేయ రామ` పరిస్థితి మరోలా వుంది. ఫ్లాప్ అని టాక్ వచ్చినా వసూళ్ల పరంగా బెస్ట్ గా దూసుకెళ్లింది. సంక్రాంతిని ఈ సినిమా బాగా క్యాష్ చేసుకుంది. `ఎన్టీఆర్ కథానాయకుడు`కంటే కొంత బెటర్ గానే వుంది. ఈ చిత్రాన్ని `రంగస్థలం` పేరు చెప్పి 90 కోట్లకు అమ్మేశారు. ఇప్పటికి గడిచిన ఆరు రోజుల్లో 54.50 కోట్ల వసూలు చేసింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 35.50 కోట్ల వసూలు చేయాలి. అది జరిగే పనిలా కనిపించడం లేదు. సినిమా డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకోవడంతో దీన్ని కాపాడటం కష్టతరంగా మారింది. పండగ సెలవులు, పండగ కలిసిరావడం బట్టే ఆ మాత్రం వసూలు చేసింది. లేదంటే ఈ సినిమా బయ్యర్లకు భారీ లాస్ మిగిలేది. ఈ పండక్కి టాక్తో పాటు వసూళ్ల పరంగా ముందున్న సినిమా `ఎఫ్2`. 34.50 కోట్లకు అమ్ముడు పోయిన ఈ సినిమా ఇప్పటి వరకు 32.10 కోట్లు వసూలు చేసి ముందు వరుసలో నిలిచింది. బ్రేక్ ఈవెన్కు 2.40 కోట్లు వసూలు చేస్తే టార్గెట్ రీచయినట్టే. ఇక తరువాత వచ్చేదంతా ప్రాఫిటే. మరి ఎవరు ముందడుగులో ఉన్నారో మనకి తెలుస్తూనే ఉంది.