వైసిపి నేతలకు నోటీసులు ఇచ్చేందుకు ఈసి రంగం సిద్ధం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఇష్టాను సారంగా కులం ఆపాదన చేసి మరీ మాట్లాడుతున్న వైసిపి నేతలకు నోటీసులు ఇచ్చేందుకు ఈసి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద మార్కులు కొట్టేసేందుకు ఏకంగారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ను కులం పేరు పెట్టి మరీ నానా దుర్భాషలాడిన విషయంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
గతంలో ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన ద్వివేదిపై ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఈసి నోటీసులు అందజేసిన క్రమాన్ని పరిగణలోనికి తీసుకుంటూ ఎన్నికల కోడ్ అమలులో ఉందని మరచి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, స్పీకర్తో సహా ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంపై చర్యలు చేపట్టాలని ఈసి భావిస్తున్నట్టు సమాచారం.
ఎన్నికల కమిషనర్ ఫలానా కులానికి చెందిన వాడు అని ఇప్పటివరకు గుర్తుకు రాని అధికార పార్టీకి… ఎన్నికలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే గుర్తుకు రావడం ఏమిటని పలువురు ఆ పార్టీకి చెందిన నేతలే విస్తుపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఆయన వ్యవహార శైలిపై మీడియా సమావేశం పెట్టి దుయ్యబట్టడమే కాకుండా విపక్షనేత చంద్రబాబు సామాజిక వర్గం అంటూ కులాల ప్రస్తావనా తీసుకువచ్చారు.
ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆదిములపు సురేష్, పేర్ని నాని, తానేటి వనిత, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు జోగి రమేష్ , ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఎస్ఇసి పై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరే అవకాశం లేకపోలేదని. వారు చేసిన వ్యాఖ్యలు అన్ని వీడియోలు స్పష్టంగా ఉండడంతో అందరికీ నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ కోరే అవకాశం ఉందని రాష్ట్రా ఎన్నికల సంఘం అధికార వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లుగా ఎస్ ఇసి కి కుల గజ్జి ఉందని, కరోనా వైరస్సా లేక కమ్మ వైరస్సా అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించడంపై సీరియస్ గా ఆయా వీడియోలను పరిశీలించే అవకాశం లేక పోలేదంటూ రాజకీయ వర్గాల్లో సైతం పెద్ద చర్చ సాగుతోంది.