వివేకా హత్య కేసులో చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని పులివెందుల హత్యకు గురైన సిఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్లకూ కూడా నోటీసులు పంపుతూ. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తదుపరి విచారణను జనవరి 20 కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి కోర్టులో తుది నివేదిక అప్పటి వరకు దాఖలు చేయబోమన్న ఏజి శ్రీ రామ్ హామీని హైకోర్టు పరిగణలోకి తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. దర్యాప్తును యథాతథంగా కొనసాగించవచ్చని సూచిస్తూనే సౌభాగ్యమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
గత ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందులో గుర్తుతెలియని వ్యక్తులు ఆతని స్వగృహంలోనే దారుణంగా హతమార్చిన విషయం విదితమే. ఈ కేసును ఏపీ పోలీసుల ప్రతిష్టాత్మకంగా తీసుకుని. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సిట్ను రద్దు చేసి మరో సిట్కు అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. 1400 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని వివేకా హత్యపై కేసు వివరాల కోసం విచారణ చేపడుతున్నారు.
కాగా ఈ కేసుని ప్రధానంగా సిబిఐకి అప్పగించాలంటూ అప్పటిలో డిమాండ్ చేసిన వైసిపి నేతలు, అధికారంలోకి వచ్చాక మాట మార్చినట్టే కనిపిస్తోంది. కేసును సిబిఐకి అప్పగించాల్సిన అవసరం లేదంటూ ఏజి కోర్టుకు చెప్పడం గమనార్హం. దీనిపై సామాజిక మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.