ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత పాలన నడుస్తోందన్న పురంధేశ్వరి

నిన్న మొన్నటి వరకు బిజెపిలో సైలెంట్ గా ఉన్న నేతలంతా ఒక్కసారిగా వైసిపి పై వైలెంట్గా మారిపోయారు. మంగళవారం కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి మీడియాలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమని, ప్రభుత్వ నిర్నయాలతో పరిశ్రమలు పారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ఏపీలో జగన్ పాలనపై వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలను మభ్య పెట్టేందుకు పెద్ద ఎత్తు పథకాలు ప్రకటిస్తున్నారని, ఆర్థిక లోటుతో వాటిని ఎలా అమలు చేస్తారో వైసిపి నేతలే చెప్పలేకపోతున్నారంటే వారి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చి అన్నారు.
ప్రతి విషయంలోనూ కేంద్రం తమకు అండగా ఉందని, అన్నీ చెప్పే చేస్తున్నామని చెపుతున్న వైసిపి నేతలు ఎప్పుడు ఎక్కడ ఏ విషయాలు చెప్పారని నిలదీసారు. ప్రజల విశ్వాసం కోల్పోతున్నందున దాని పర్యావసానాలను కేంద్రానికి కూడా పూసేందుకు వైసిపి నాటకాలాడుతోందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విధానాల వల్ల ఉన్న పరిశ్రమలే కాదు కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. మూడురాజధానుల అంశంతో పెట్టుబడులు రాకుండా వెనక్కి వెళ్లిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మండలి వల్ల ఉపయోగం లేదని 7 నెలల తరువాత జగన్కి గుర్తు కొచ్చినట్టుంది. మరి తొలి భేటీలోనే శాసన మండలి రద్దు కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదని నిలదీసారు పురందరేశ్వరి. ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా 33 వేల ఎకరాలను రాజధాని కోసం రైతులు ఇస్తే, వారిని కించపరిచేలా మంత్రులు మాట్లాడుతున్నారని, ముందుకు వారికి అభివృద్ధి చేసిన భూములు ఎప్పుడు ఇస్తారు ఎలా న్యాయం చేస్తారోచెప్పాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రివర్స్ టెండరింగ్తో కోట్లు మిగిల్చామని చెపుతున్న వైసిపి పోలవరం పనులు కుంటుపడి పెద్ద ఎత్తున నష్టం కలిగించడంతో పాటు అంచనాలు పెంచుకునేందుకు దారులు వెతుకుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు.
యుపిఏలో తాము చేరుతున్నట్టు మంత్రి బొత్స మీడియా ముందు లీకులు ఇచ్చిన నేపధ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఒక్కసారిగా ఏపీ బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి జగన్ పాలనపై విమర్శలు చేస్తుండటం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.