బ్యాంకు ను బురిడీ కొట్టించిన అప్రైజర్

కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్ర సహకార బ్యాంక్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకు అప్రైజర్ గా పని చేస్తున్న వ్యక్తి ఖాతాదారులను బురిడీ కొట్టించడంతో పాటు బ్యాంక్లో కొత్త అకౌంట్లు ఓపెన్ చేసి రోల్డ్ గోల్డ్ నగలతో బంగారు ఆభరణ రుణాలను తీసుకుని స్వాహా చేసిన విషయం వెలుగు చూసింది. ఇటీవల ఓ ఖాతా దారు తన పేరుతో ఋణం తీసుకున్నట్టు వచ్చిన నోటీసుతో బ్యాంకు మేనేజర్ని సంప్రదించారు. తనకు ఉన్నది ఒకే ఖాతా అని, సంబంధిత ఖాతా ద్వారా తీసుకున్న బ్యాంకులోన్ ఇప్పటికే చెల్లించినట్టు పేర్కొనటంతో అనుమానం వచ్చిన మేనేజర్ బ్యాంకులోని నగలను- తీసుకున్న రుణాలను తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దాదాపు 500 మంది ఖాతాదారులు గతంలో అందించిన ఆధార్, ఇతరత్రా ధృవప్రతాలకు నకళ్లు సృష్టించి, వారి పేరుతో రోల్డ్గోల్డ్ తాకట్టుపెట్టిన అప్రైజర్ లక్షల్లో బ్యాంక్కు టోపీపెట్టాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఖాతా దారులు అసలు తమ నగలు సరిచూసుకోవాలని , వాస్తవ విరుద్ధంగా ఉన్నవాటి సమాచారం అందించాలని మేనేజర్ విజ్ఞప్తి చేయడంతో ఆందోళనతో ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టి, తమ బంగారం పై ఆరాలు తీస్తున్నారు.