మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను….ప్రముఖ వైకాపా నేత

ఇప్పటికే అక్రమాస్తుల కేసులో బెయిలుపై ఉన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన తన భార్య వైఎస్. భారతికి ముఖ్యమంత్రి రాజకీయ నిర్ణయాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదెంత వరకు నిజమో తెలియదు కానీ తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త, ప్రముఖ సినీ నిర్మాత, వైకాపా నేత, పొట్లూరి వరప్రసాద్ చేసిన ఓ ట్వీట్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
నవ్యాంధ్రకు మహిళా సిఎం చూడాలనుకుంటున్నానంటూ పీవీపీ చేసిన ట్వీట్ సామాజిక మీడియాలోనే కాదు వైకాపా నేతలలోనే చర్చకు దారి తీసింది. సొంత పార్టీలోనే కాక రేపుతున్న పీవీపీ ట్వీట్ ఇలా ఉంది. ‘బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ… మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్టర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి… కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు. ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి, మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం’ అంటూ ట్వీట్ చేశారు. పీవీపీ ఇలా చేసిన ఈ ట్వీట్ను స్క్రీన్ షాట్ తీసి నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేసి పడేసారు. అయితే తరువాత ఏమనుకున్నారో ఏమో కాసేపటి కి తన ట్వీట్ను తనే డిలీట్ చేసేసారు పీవీపీ.
ఈ క్రమంలోనే పీవీపీ కోరుకుంటున్న మహిళా సీఎం ఎవరన్న చర్చ మరోమారు వైసిపి వర్గాలలో చర్చ కాస్త రచ్చ రచ్చఅవుతోంది. వైయస్ భారతి? వైయస్ షర్మిళ? వైయస్ విజయమ్మ? వీరిలో ఎవరనే చర్చ కు తెరలేచింది. అందునా శుక్రవారం జగన్ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో పివిపి చేసిన ట్వీట్ సంచలనమై కూర్చుంది. రాష్ట్ర రాజకీయాలను నిశితంగా గమనించి, ఎప్పటికప్పుడు సామాజిక మీడియాలో తనదైన సెటైర్లతో విపక్షాలపై విమర్శల జడివాన కురిపించే పివిపి చేసిన మహిళా ముఖ్యమంత్రి ట్వీట్ సొంత పార్టీలోనే ఇప్పుడు కలకలం రేపుతోంది. మరి వైసిపి నేతల స్పందన ఎలా ఉండబోతోందో చూడాలి.