అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారుల ఆధీనంలో అహ్మదాబాద్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సకుటుంబ సపరివార సమేతంగా గుజరాత్లోని అహ్మదాబాద్ కి వచ్చేసారు. భారత ప్రధాని మోడీ అతని పరివారానికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో పర్యటించే ప్రాంతాలన్నింటినీ అనువనువునా పరిశీలిస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఇక్కడకు చేరుకున్న వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలతో పాటు భారత్కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భారీ ఎత్తున మోహరించి ఎప్పటికప్పుడు క్షణ్ణంగా డేగకళ్లతో పరిశీలిస్తున్నారు.
కాగా ట్రంప్ పర్యటిస్తున్న ప్రాంతాలన్నింటినీ అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని 10 వేల మంది పోలీసులతో కలసి పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా సిబ్బందిగా చెప్పే ఈ సీక్రెట్ ఏజెన్సీ. అమెరికా అధ్యక్షుడు ఆతని కుటుంబ సంరక్షణ విషయంలో ఎట్టపరిస్థితిలోనూ రాజీ పడకుండా వ్యవహరిస్తుండటంతో భారత పోలీసులకు కొంత ఇబ్బంది కలుగుతోంది. ఇప్పటికే ట్రంప్ పర్యటించే ప్రాంతాలలో బిచ్చగాళ్లెవరూ కనిపించకుండా మోడీ సర్కారు ఆదేశాలతో రోడ్లకు ఇరువైపులా గోడల నిర్మాణం జరపటం విశేషం.
ఈ సీక్రెట్ ఏజన్నీ ఆదేశాలతో అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తోంది. సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుండటం మరో విశేషం. వీరు కూడా అత్యంత కఠినమైన శిక్షణ పొందిన వారే. అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధం చేస్తూ, ప్రతి చిన్న విషయాన్నీ పరిగణలోనికి తీసుకుని పర్యవేక్షిస్తోంది. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడుగా ఎన్ని ఆదేశాలు జారీ చేసినా, అమెరికా చట్టం ప్రకారం.. ఆతనిని నిత్యం వెన్నంటే ఉంటుంది.