పేరుకే అమాత్యులం అధికారమంతా అధికారులదే

నిన్న మొన్నటి వరకు తాను జగన్కు సన్నిహితుడునని, తనకు మించిన వారు లేరేలేరని చెపుతూ వస్తున్న సమాచార మరియు రవాణా శాఖ మాత్యులు పేర్ని నానికి ఆయా శాఖల ద్వారానే షాకుల మీద షాక్ లు ఇస్తున్నారట జగన్. దీంతో తాను రెండు శాఖలకే పేరుకే మంత్రిగా ఉన్నా నన్ను ఆయా శాఖల అధికారులు పట్టించు కోవటమే లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తు ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.
ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ సమాచార మరియు రవాణా శాఖ మాత్యులు పేర్ని నానికి బాధ్యతలు ఇస్తూనే మరోవైపు తనకు సన్నిహితుడైన అధికారి సమాచార శాఖ కమీషనర్గా నియమించారు.అలాగే అదే విధంగా రవాణా శాఖ కమీషనర్, ఆర్టీసి ఎండీలుగా జగన్ తనకు సన్నిహితులైన ఐపిఎస్ అధికారులు సీతారామాంజనేయులు, మాదిరెడ్డి ప్రతాప్లు నియమించారు. అంతవరకు బాగానే ఉంది. సమాచార శాఖ కమీషనర్తో మంత్రి పేర్ని నానికి పెద్దగా ఇబ్బంది లేకున్నా…. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయటంలో వెనుకంజ వేస్తుండటమే అతనికి తలనొప్పిగా మారింది. చివరకి అక్రిడేషన్ల వ్యవహారంలోనూ ఇదే పంధా కావటంతో నిలదీసే పాత్రికేయులకు సమాధానాలు వెతుక్కోవలసిన పరిస్థితి.
ఇక రవాణా శాఖ కమీషనర్, ఆర్టీసి ఎండీలు మంత్రి ఆదేశాలను ఖాతరు చేయటం లేదని పేర్ని తన సహచరుల వద్ద వాపోతున్నట్టు తెలియవచ్చింది. రవాణా శాఖ కమీషనర్ సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్న నేపధ్యంలో ఆయన మంత్రిని లెక్క చేయటం ఏనాడో మానేసారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే ఏదైనా విషయమై ఆర్టీసి ఎండీకి మంత్రి ఫోన్ చేసినా.. ఆయన అందుబాటులోకి రావటం లేదని, తన శాఖలో ఇద్దరు పోలీసు అధికారులను నియమించటంతో పేరుకే తను మంత్రినని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని, మంత్రి నానికి మింగుడు పడటం లేదట. పోనీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళదామంటే ఆయనెక్కడ ఉన్నది ఊడగొడతాడో నన్న భయంతో మంత్రి గారికి ధైర్యం చాలటం లేదంటూ వినవస్తోంది.
ఇటీవల మంత్రి నాని కొందరు అధికారులతో తన కార్యాలయంలో పిచ్చాపాటి మాట్లాడుతూ.. నాకిచ్చిన సమాచార శాఖలో పని ఏమీ ఉండదు. పిఆర్ ఓలు ఇచ్చినవి మీడియా ముందు చదవటమే. ఇక సిఎం గారు తన రవాణా శాఖలో ఇద్దరు ఐపిఎస్ అధికారులను నియమించారు. వారిద్దరు నన్ను పట్టించుకోవటమే లేదు. కనీసం నేను చెప్పింది వినరు. ఫోన్ కూడా తీయరు. ముఖ్యమంత్రి ఆదేశాలను మాత్రమే వారు అమలు చేస్తారు. ఇలాంటి పరిస్థితి నాకు ఎదురవుతుందని అనుకోలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారట
ఇంత మంది మంత్రులలో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందనే విషయం నాకు తెలీదు కానీ పెత్తన మంతా అధికారులదే అన్నది నిజమేనంటున్నారు మంత్రి పేర్ని నాని సన్నిహితులు. నిన్న మొన్నటి వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్తి పోసిన పేర్ని నాని తన దూకుడును కాసింత తగ్గించుకుని, మంత్రి వర్గ సమావేశ వివరాలను చెప్పేందుకు మీడియా సమావేశాలలో మాత్రమే పరిమితం అయిపోయినట్టు కనిపిస్తోంది. పేరుకే రెండు శాఖలకు మంత్రిని పెత్తనమంతా వారిదేనంటూ పేర్ని సన్నిహితులు వద్ద చేసిన వ్యాఖ్యలు నిజమేనంటున్నారు.