రాజధాని బిల్లు పై కీలక నిర్ణయం తీసుకున్న మండలి చైర్మెన్ కు అభినందనల వెల్లువ

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై చట్టపరిధిలో ఎదుర్కొన్న మండలి చైర్మన్ షరీఫ్కు సర్వత్రా నీరాజనాలందుతున్నాయి. సభని వాయిదా వేసి నరసాపురం బయలు దేరిన ఆయనకు పశ్చిమగోదావరి జిల్లాలోఅడుగడుగునా ఘనస్వాగతం లభించింది. గాంధీబొమ్మ సెంటర్లో పెద్ద ఎత్తున ముస్లిం మతపెద్దలు, స్థానికులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి అభినందనలతో ముంచెత్తారు.
ఈ సందర్భంగా అధికార పార్టీనుంచి ఎన్ని వత్తిళ్లు వచ్చినా, విజయసాయిరెడ్డి బిల్లుల ఆమోదం కోసమంటూ చైర్మన్ చాంబర్లో పదే పదే చేసిన హెచ్చరికలను సైతం ఎదుర్కొని ధర్మాన్ని నిలబెట్టడంలో మండలి ఛైర్మన్ పాత్ర కీలకభూమిక పోషించారని మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర ప్రశంసలు గుప్పించారు. చాలా ఒత్తిడిని తట్టుకొని మీరు నిర్ణయం తీసుకొన్నారంటూ… లక్షలాది మంది గుండెల్లో మీరు ఉంటారని మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు ఛైర్మన్ ని అభినందిస్తూ పాదాభివందనం చేయటం విశేషం. మరోవైపు మండలిలో ఛైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినందుకు అమరావతిలో ఆయన చిత్రపటానికి జేఏసీ నేతలు పాలాభిషేకం చేశారు..
అయితే షరీఫ్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించాడని, దేశంలో ఎక్కడా అమలు కాని తీరుగా రూల్ 71ని తీసుకురావటమేంటని మంత్రులు మండిపడుతున్నారు.