నేడు ఎల్బి స్టేడియంలో పలకనున్న సుస్వరాలు

సంగీత దాసుడు కె.జె.ఏసుదాసు. సుస్వరాల బాలుడు, గానగంధర్వుడు, తన గాత్రంలో జనాలను ఓలలాడించగల సమర్ధుడు ఎస్పి బాలసుబ్రమణ్యం. తీపి రాగాల కోయిలమ్మ కె.ఎస్.చిత్ర సినీ వినీలాకాశంలో ఈ ముగ్గురు దేదీప్యమానంగా ఏనాటికైనా వెలిగొందే సుస్వరాల తారలు. ఈ ముగ్గురి అపురూప కలయికలో నవంబర్ 30న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో ఎలెవన్ పాయింట్ టు మరియు బుక్ మై షో వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున సినీ సంగీత విభావరి జరగనుంది అలేఖ్య హోమ్స్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 5.30 నిముషాలకు మొదలు కానుంది. దీనిలో ఏసుదాస్, ఎస్ పి బాలసుబ్రహ్మణం, చిత్ర, చరణ్, పల్లవి, శైలజలతో పాటు పలువురు సినీ నేపథ్యగాయకులు పాల్గొని తన గాత్రంతో ఓలలాడించనున్నారు. ఈ మేరకు సినీ గాయకులు జనాళికి ఆహ్వానం పలుకుతు హైదరాబాద్ సోమాజిగూడ పార్క్ హోటల్ లో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు
కె.జె.ఏసుదాసు మాట్లాడుతూ… నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా సోదరుడు బాలసుబ్రమణ్యం, నా కూతురు లాంటి చిత్రతో కలిసి పాడడం చాలా సంతోషం గా ఉందన్నారు. చిన్నప్పటి నుండి ఎక్కువగా మాట్లాడకు పాడు అని నా తండ్రిగారు చెప్పేవారు. ఏ భాషలోనైనా మాట్లాడటం రాకపోయినా పాడటం నేర్చుకో అని అన్నారు. అదే నేను చేస్తున్నది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి ఆనందించగలరని కోరుకుంటున్నానని అన్నారు.
బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ… మేం ముగ్గురం కలిసి. మొట్ట మొదటిసారిగా సింగపూర్లో చాలా అద్భుతంగా ప్రోగ్రాం చేసాం. ఇప్పుడు హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు దాని వెనక ఎంత కాల వ్యయం, ధన వ్యయం ఉంటున్నా లెవన్ టుపాయింట్, అలేఖ్య హోమ్స్ వెనుకాడ కుండా నిర్వహిస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్నిసపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ముగ్గురు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. మా ముగ్గురు పాడిన పాటల సంఖ్య లక్షకి పైగా ఉంటాయి. ఒకొక్కరు 25, 30 వేలు పాటలు పాడాం. మూడుగంటల సేపు జరిగే ఈ కార్యక్రమంలో ఏ పాటలను సెలెక్ట్ చెయ్యాలి ఏమిటి అన్న గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఉంటుంది. మా మీద అభిమానంతో ప్రేమతో అది పాడతారు ఇది పాడతారు అనుకుంటారు. సాధ్యమైనంత వరకు అందరికి నచ్చే పాటలను ఎంపిక చేసుకుని దాన్ని మీ ముందు ఉంచుతాము. ఈ కార్యక్రమానికి వేరే వేరే రాష్ట్రాలనుంచి 20 మంది వాద్య బృందంకూడా వస్తున్నారు. ఇది అంత సుభమైన కార్యక్రమం కాదు దీని కోసం ఒక ఆరు నెలలు ప్రాక్టీస్ కావాలి. మాలో ఉన్న మంచి లక్షణం ఏమిటంటే ఇంకా మాకు భయం ఉండటం. భయముంటేనే కార్యక్రమం బాగా జరుగుతుంది. అందర్నీ ఆనందపరచడానికి మేము భయంతో భక్తితో శ్రద్ధతో కృషిచేస్తున్నాము. మీ అందరి అభిమానం, ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించాలి అన్నారు.
చిత్ర మాట్లాడుతూ… పెద్ద లెజెండ్స్ తో కలిసి పాడటం నా అదృష్టం. నాకు బాగా పాడాలని ఉంది. నాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
అలేఖ్య హోమ్ శ్రీనాధ్ మాట్లాడుతూ… దిగ్గజాల ముందు మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మా సంస్థ తరుపున ఏ కార్యక్రమం అయినా మీ ముందు ఉంటుంది. సంస్థ బ్రాండింగ్ కోసం మాత్రం కాదు. కోట్ల మందిని స్వరం తో అందరినీ అలరిస్తున్నారు. మీ స్వరం ఒక వరం. మహానుభావులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన చరణ్కి కృతజ్ఞతలు.