ఇక ప్రతి బస్స్టాప్ సెంటర్కు ఒక మహిళా ఎస్సై

మహిళలు, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా మహిళల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన దిశ చట్టం అమలు కోసం 87 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిధులు మంజూరు చేశారు. ఈనిధులను రాష్ట్రంలో మహిళా పోలీసుస్టేషన్ల ఉన్నతీకరణ, ఫోరెన్సిక్ ప్రయోగశాలల బలోపేతం… ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, దిశ కాల్సెంటర్, యాప్ల కోసం వినియోగించనున్నారు. ప్రతి బస్స్టాప్ సెంటర్కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేయటంతో పాటు ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు..
అలాగే విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేయటంతో పాటు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ , సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేస్తారు. అలాగే కోటి 26 లక్షల రూపాయలను దిశ యాప్ కోసం వినియోగించనున్నారు. డయల్ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి దాన్ని దిశ కంట్రోల్ రూంగా పిలవనున్నారు.