దసపల్లా హోటల్లో ‘భీష్మ‘ విజయోత్సవ వేడుక

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీష్మ‘ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించి కలెక్షన్లని కురిపిస్తోంది. రష్మికా మందన్న నాయికగా నటించిన ఈ సినిమాకు ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో విజయోత్సవ వేడుక జరిగింది.
ఈ సందర్భంగా ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మాట్లాడుతూ, “ప్రి రిలీజ్ ఈవెంట్లో నేను చెప్పినట్లే ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు. ‘ఛలో’తో హిట్ కొట్టిన వెంకీ, ‘భీష్మ’తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నాడు. సినిమాలో మంచి కామెడీ ఉంటే, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు హిట్ చేస్తారని ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’, ఇప్పుడు ‘భీష్మ’ నిరూపించాయని చెప్పారు.
దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, “ నా స్క్రిప్టును నమ్మి ‘భీష్మ’ను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు చినబాబు, వంశీ , నితిన్ లకు కృతజ్ఞతలు నా టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడం వల్లే నేను అనుకున్న విధంగా సినిమా తియ్యగలిగాను. ‘దిల్’ సినిమా నుంచి నేను నితిన్ ను అభిమానిస్తూ వస్తున్నా, కథ చెప్పగానే వెంటనే ఒప్పుకొని రష్మిక స్నేహానికి విలువ ఇచ్చింది” అన్నారు.
హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ, “ఈ మూవీకి క్రిటిక్స్ మంచి రివ్యూస్ ఇచ్చారు. సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. మంచి మ్యూజిక్, చక్కని సినిమాటోగ్రఫీతో అన్నీ చక్కగా కుదిరిన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ, “సినిమాను చూసిన వారంతా నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. అదంతా డైరెక్టర్ వెంకీ ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టి క్రిడిట్ ఆయనదే. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా. రష్మికతో కంటే సంపత్ రాజ్ తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. ‘భీష్మ’తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చిందనే చెప్తాను. ‘అ ఆ’తో నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్టిచ్చిన బ్యానర్ నాకు మళ్లీ హిట్ ఇచ్చింది ” అని చెప్పారు.
ఈ విజయోత్సవ వేడుకలో సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్, నటుడు సంపత్ రాజ్ , సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ , గేయరచయిత కాసర్ల శ్యామ్, సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ చిత్ర బృందం పాల్గొన్నారు.