పరీక్షలు, కాలేజ్ యాజమాన్య ఒత్తిడికి మరో యువతి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెలలోని నారాయణ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి (16) అనే విద్యార్థిని పరీక్షల ఒత్తిడి, అనారోగ్యం తదితర కారణాలతో మానసికంగా కుమిలిపోతూ, మంగళవారం ఆత్మహత్య చేసుకుంది.
వారం రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా, యాజమాన్యం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరంతో పరీక్షలకు ఎలా చదవగలను? ఎలా రాయగలను అంటూ ఇంట్లో వారికి ఫోన్లో సమాచారం అందిస్తే, ఆమె తల్లిదండ్రులు వస్తామన్నా… కాలేజ్లో ఒప్పుకోరంటూ నిలువరించింది. ఈ నేపథ్యంలో ఆమె బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సమాచారం అందటంతో ఆమె తల్లి దండ్రులు కాలేజ్కి వచ్చి, యాజమాన్య నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారాయణ యాజమాన్యం కళాశాల ముందు దొమ్మి చేస్తున్నారంటూ ఫోన్లో సమాచారం ఇవ్వటంతో వారు రంగంలోకి దిగి కాగా నేడు పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ విద్యార్థిని తండ్రి చంద్రశేఖర్ను బైటకు ఈడ్చి పారేసారు. శ్రీధర్ రెడ్డి పోలీస్ కానిస్టేబుల్ కాలుతో తంతూ తక్షణం ఇక్కడ నుంచి శవాన్ని తీసుకెళ్లిపోవాలంటూ రంకెలేసాడు. అప్పటికే విద్యార్ధిని ఆత్మహత్య సమాచారం గుప్పుమనటంతో మీడియా కాలేజ్ కి వెళితే … కానిస్టేబుల్ కన్నూ మిన్నూ కానకుండా ఆ తల్లిదండ్రులతో ప్రవర్తించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఈ దృశ్యాన్ని కొందరు జర్నలిస్టులు రికార్డ్ చేసి సామాజిక మీడియాలో ఉంచారు. కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ.. పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఈ విషయంపై స్పందించేందుకు సంబంధిత పోలీసు అధికారులు నిరాకరించారు. దర్యాప్తు చేసి, నిర్ణయం తీసుకుంటామని టూకీగా చెప్పి తప్పించుకున్నారు.