హుథ్హుథ్ బాధితుల కోసం నిర్మించిన ఇళ్లు ప్రారంభోత్సవం

హుథ్హుథ్ తుఫాను బాధితుల కోసం సినీపరిశ్రమ సాయంతో నిర్మించిన ఇళ్లు ప్రారంభోత్సవం చేయాలని సినీ రంగ ప్రముఖులు సీఎం జగన్ని కలసి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి వైయస్.జగన్ను క్యాంపు కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్రెడ్డి, జెమిని కిరణ్లతో కూడిన బృందం కలసి తాము చేపట్టిన ఇళ్ల నిర్మాణాల గురించి వివరించారు.
అనంతరం మీడియాతో వల్లభనేని వంశీ మాట్లాడుతూ హుథ్ హుథ్ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన వారి కోసం సినీపరిశ్రమ రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి, టెలీథాన్ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని చెప్పారు. ఈ షో నిర్వహణ ద్వారా వచ్చిన 15 కోట్ల రూపాయలతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యిందని వాటిని ప్రారంభించి ఇళ్లు కోల్పోయిన పేదలకు అందించాలని కోరామని తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.