నాగబాబు కొత్త షో `అదిరింది`

ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం నాగబాబు ఆ షో నుంచి బయటకు వచ్చారు. ఆయన జబర్దస్త్ షోకి జడ్జిగా చేసేవారు. కంటెస్టెంట్లు చేసే కామెడీకి నాగబాబు నవ్వులు ఆ షోకి హైలెట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఆ షో నుంచి బయటకు వచ్చి జీ తెలుగులో `అదిరింది` అనే మరో షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో వచ్చే ఆదివారం నుంచి ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ సంబంధించి ‘మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్’ అంటూ ప్రోమోను విడుదల చేశారు. తాజాగా బుధవారం నాడు మరో ప్రోమోను విడుదల చేస్తూ షో ఎలా ఉండబోతుందో హింట్ ఇవ్వడమే కాకుండా యాంకర్ ఎవరు? నాగబాబు పక్కన జడ్జిగా ఉండబోయేది ఎవరు? ఏయే టీంలు ఉండబోతున్నాయి? అసలు అదిరింది కాన్సెప్ట్ ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నాలుగున్నర నిమిషాలు ప్రోమోను విడుదల చేశారు.
ఇక ఈ షోకి గ్లామరస్ హోస్ట్ అంటూ యాంకర్ సమీరా ‘అదిరింది’ అంటూ హొయలొలికిస్తుంది. ఇక జడ్జిగా నాగబాబు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి.. నా ఎంట్రీనే కాదు.. షో కూడా అదిరిపోద్ది చూస్తుండు అంటూ సెటైర్లు మొదలు పెట్టారు.
ఇక మెగా డాటర్ నిహారిక సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి నాగబాబు పక్కన పకా పకా నవ్వడానికి జడ్జి చైర్లో సెటిల్ అయిపోయింది. నన్ను స్పెషల్ గెస్ట్ అనొద్దు.. ఇది నా ఫ్యామిలీ.. ఎంతమంది ఉన్నారన్నది కాదు.. ఎవరున్నారన్నదే ముఖ్యం అంటూ తండ్రిబాటలోనే జబర్దస్త్ షోపై సెటైర్లు వేయడం మొదలుపెట్టింది.